- వైరస్ ముప్పు తొలగలేదు .. మోదీ
- స్వీయనియంత్రనే శ్రీరామ రక్ష ..
- సైనికుల త్యాగాలను కొనియాడిన మోదీ
- మన్ కీ బాత్ లో దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని
ఢిల్లీ: మన్కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోదీ సైనికుల త్యాగాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. కార్గిల్ యుద్ధంలో సైనికులు చూపిన ధైర్య పరాక్రమాలు ఎప్పటికీ మరువలేనివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దీవాస్ సందర్భంగా సైనికులు చేసిన త్యాగాలను ప్రధాని కొనియాడారు. సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని వారి శౌర్య పరాక్రమాలు భావితరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. సైనికుల త్యాగాలను దేశంలోని యువకులు విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ కుట్రపూరితంగా భారత్ భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేయడంవల్లే కార్గిల్ యుద్ధం సంభవించిందన్నారు. భారత్ మాత్రం ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ఆరాటపడుతుందని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని ప్రజలు స్వీయ నియంత్రణ పాటించక తప్పదని ప్రధానమంత్రి హెచ్చరించారు. దేశంలో చాలా ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా వైరస్ సమర్ధవంతంగా ఎదుర్కోవలసిన అవసరం ఎంతైనా ఉందని మోదీ మరోసారి స్పష్టంచేశారు.