కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ టాప్
న్యూఢిల్లీ: వ్యాక్సికేషన్ డ్రైవ్లో భారత్ టాప్లో నిలిచిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలోని ప్రముఖ దేశాలతో పోల్చితే దేశంలో తొలి రోజు అత్యధిక మంది టీకా వేయించుకున్నారని పేర్కొంది. శనివారం దేశవ్యాప్తంగా 2,07,229 మందికి కరోనా టీకాలు వేసినట్లు వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల్లో తొలి రోజు టీకా వేయించుకున్న వారి సంఖ్య కంటే ఇది అత్యధికమని వివరించింది. మరోవైపు రెండో రోజైన ఆదివారం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే టీకా కార్యక్రమం కొనసాగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ తెలిపారు. రెండో రోజున దేశవ్యాప్తంగా 553 కేంద్రాల్లో 17,072 మందికి టీకాలు వేసినట్లు చెప్పారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,24,301 మంది కరోనా టీకా వేయించుకున్నారని వెల్లడించారు. మరోవైపు శని, ఆదివారాల్లో టీకా వేయించుకున్న 447మందిలో స్వల్ప ప్రతికూలతలు కనపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో చాలా వరకు జ్వరం, తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించాయని పేర్కొంది. ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, చికిత్స అనంతరం ఢిల్లీలో ఇద్దరు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ఎయిమ్స్ రిషికేశ్లో ఒకరు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించింది.