నర్సీపట్నం: తరతరాలుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న అణిచివేత, వివక్షలను రూపుమాపుతూ పౌరులంతా సమానంగా ఎదిగే ప్రత్యేక అవకాశాలను కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన పెద్దలను గుర్తుచేసుకుంటూ ప్రతిసంవత్సరం జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య తెలిపారు. మంగళవారం 72 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసి, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టరు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితం వారు మనకు కల్పించిన ప్రాథమిక హక్కులైన సమానత్వం, లౌకికతత్వం, ఐకమత్యంలకు కృతజ్ఞతలు తెలియ చేసుకోవాలన్నారు. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా 1950 జనవరి 26న అవతరించిందన్నారు. ఈ రోజున భారత ప్రజలు అందరూ సంపూర్ణ స్వేచ్ఛ, న్యాయాన్ని పూర్తి స్ధాయిలో ఒక హక్కు గా పొందడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నానన్నారు.
ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత.
నర్సీపట్నం డివిజన్ పరిధిలో గల పది మండల కార్యాలయాలలో పనిచేస్తున్న 12 మంది సిబ్బంది ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రాలను సబ్ కలెక్టర్ మౌర్య అందించారు. జిల్లా స్ధాయిలో 4గురు సిబ్బంది విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా స్వీకరించనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి ప్రసాద్, కార్యాలయ సిబ్బంది, నర్సీపట్నం పోలీస్ కార్యాలయపు సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది, మండల తాసిల్దార్ జయ, ఇతర అధికారులు సిబ్బంది పాఠశాలల విద్యార్థినులు హాజరయ్యారు.