ఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పయనిస్తేనే సమాఖ్య స్ఫూర్తికి అర్థమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి శనివారం భేటీ అయ్యింది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాల మధ్యే కాకుండా జిల్లాల మధ్య కూడా సమాఖ్య స్ఫూర్తి ఉండాలని సూచించారు. భారత్ను ఆత్మనిర్భర్గా తీర్చిదిద్దేందుకు ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు కల్పించాలని మోదీ అన్నారు. ప్రైవేటు రంగ అభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘‘కరోనా సమయంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేశాయి. దీంతో వైరస్ను ఎదుర్కోవడంలో దేశం విజయం సాధించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో లక్ష్యం దిశగా పయనించడమే దేశ అభివృద్ధికి పునాది. అదే సమాఖ్య స్ఫూర్తికి అర్థం. అప్పుడే ఆర్థిక వృద్ధి కూడా సాధించగలం. ఇంతే కాదు రాష్ట్రాలతో పాటు జిల్లాల మధ్య కూడా పోటీ, సహకారం ఉండాల్సిన అవసరం ఉందని మోదీ వివరించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో దేశం విజయం సాధించిందని, ప్రపంచం ముందు భారత్ తన ఖ్యాతిని మరింత పెంచుకుందని పేర్కొన్నారు.
బడ్జెట్పై స్పందన: ఈ ఏడాది బడ్జెట్పై దేశమంతా సానుకూల స్పందన రావడం దేశ ప్రజల మనోభావాలను అద్దం పడుతోందని అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటోందని, ఇలాంటి సమయంలో ప్రజలు సమయాన్ని వృథా చేయాలనుకోవడం లేదని మోదీ అన్నారు. ముఖ్యంగా యువత అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోత్సాహక పథకాలు ప్రతి ఒక్కరికీ అనేక అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. గడిచిన కొన్నేళ్లలో కొన్ని కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు కల్పించామని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఆరోగ్య సదుపాయాలను మెరుగుపర్చడంతో పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని తెలిపారు.
దీదీ, అమరీందర్ గైర్హాజరు: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులు హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటైన లద్దాఖ్, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మాత్రం భేటీకి దూరంగా ఉండటం గమనార్హం.