అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీ పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికి పరిమితం చేసేలా డీజీపీని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై ఆదివారం విచారణ జరిగింది. ఎన్నికల కమిషనర్ ఈనెల 6న ఇచ్చిన ఉత్వర్వులు ఏకపక్షంగా ఉన్నాయని మంత్రి తన పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు ముందుగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, వివరాలు తీసుకోకుండా ఇంటికే పరిమితం చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రపతి తిరుమలకు వస్తున్నారని, ప్రొటోకాల్ను అనుసరించి ఆహ్వానించాల్సిన బాధ్యత తనపై ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతిని ఆహ్వానించేందుకు మంత్రి పెద్దిరెడ్డి వెళ్తే అభ్యంతరం లేదని ఎస్ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితమై ఉండాలని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. మంత్రి మీడియాతోమాట్లాడొద్దు అన్న ఆదేశాలను హైకోర్టు సమర్థించినట్టు తెలుస్తోంది.
హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్... ఎస్ఈసీ ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు
February 07, 2021
0
Tags