నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన అఖిలప్రియ
ఆళ్లగడ్డః నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఇరువురి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రవిచంద్రకిశోర్ రెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని అఖిలప్రియ తెలపడమే కాకుండా, నంద్యాల గాంధీ చౌక్ వద్దకు వస్తే ఆధారాలను బహిర్గతం చేస్తానని… దమ్ముంటే అక్కడకు రావాలని సవాల్ విసిరారు.
ఈ క్రమంలో ఆమె ఈ ఉదయం ఆళ్లగడ్డలోని తన నివాసం నుంచి నంద్యాల గాంధీ చౌక్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆమె నంద్యాలకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందని భావాయించిన ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్ రెడ్డి తన పోలీసు సిబ్బందితో కలిసి అఖిలప్రియ నివాసానికి వెళ్లారు. శాంతిభద్రతల నేపథ్యంలో నంద్యాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నామని నోటీసులు ఇచ్చారు. ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. అఖిలప్రియ ఇంటి వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.