గుంటూరు: గుంటూరు ప్రగతి నగర్లో అదాయపన్ను అధికారుల పేరుతో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు. రూ.50లక్షల నగదు చోరీకి గురికాగా నిందితుల నుంచి రూ.48.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అరకిలో బంగారానికి గాను 132 గ్రాముల బంగారం రికవరీ చేశారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఏఎస్పీ శ్రీనివాస్, సుప్రజా మీడియా కి వెల్లడించారు.
‘‘సింగంశెట్టి కల్యాణి అనే మహిళ చాలా కాలం నుంచి ఉన్నత కుటుంబానికి చెందిన దొడ్డ ప్రసాద్ ఇంట్లో పనిచేస్తోంది. ప్రసాద్కు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. కల్యాణి ఇంట్లో అయితే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు దాచుకున్నాడు. ఎంత బంగారం ఉంది, ఎన్నినగలు ఉన్నాయనే విషయం కల్యాణికి కూడా తెలియదు. దీంతో ట్రంకు పెట్టెలో, బియ్యం డబ్బాలో ఆమె భద్ర పరిచింది. కల్యాణి ఇంట్లో డబ్బులు ఉన్నాయని సమీపంలో నివసించే ఏసుబాబు, జాన్బాబుకు తెలిసింది. ఈ డబ్బులు, బంగారం ఎలా దోచుకోవాలా అని ఆ ఇద్దరూ పథకం వేశారు. బండ్లమూడి సురేష్, విజయ్ కుమార్తో కలిసి ఐటీ అధికారులమని చెప్పి కల్యాణి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను బెదిరించి డబ్బు, బంగారం తీసుకెళ్లారు. కల్యాణి ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరా స్టోరేజీ పాయింట్ను కూడా తీసుకుని వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను 48 గంటల్లో అరెస్టు చేశామని ’’ ఎస్పీ తెలిపారు.