మీడియా పవర్, విశాఖపట్నం: మార్చి13వ తేదీన జరగబోవు ఉత్తరాంధ్ర పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు విశాఖ నగర పోలీసు కమిషనర్ సిహెచ్. శ్రీకాంత్ ఐపిఎస్ , లా అండ్డి ఆర్డర్ డి .సి.పి -1, డి.సి.పి -2, (క్రైమ్స్)డి.సి.పి మరియు నగర పోలీసు అధికారులతో , పోలీస్ సమావేశమందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నగర పోలీస్ కమీషనర్ అన్ని స్టేషన్ల ఎస్.హెచ్.ఓ లతో మాట్లాడుతూ అందరూ తమ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పూర్తి గా అవగాహన కలిగి ఉన్నమన్న విషయాన్నీ నిర్ధారించుకున్నారు.
అనంతరం డి.సి.పి లను తమ జోన్ లలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్న బందోబస్తు విషయంపై ఆరా తీశారు, పోలింగ్ సమయంలో పోలింగ్ మెటీరియల్ తీసుకెళ్ళు వాహనాలకు ఉండవలసిన రక్షణ దళం ఏర్పాట్లను సక్రమంగా చూడాలన్నారు. మొత్తం రూట్లు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ల సంఖ్య పై చర్చించారు, అదనముగా ఉండవలసిన రిజర్వు బలగాల ఏర్పాట్లను, వాటిని ఏయే జోన్లకు కేటాయించాలో ఆదేశించారు. చెక్ పోస్టుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికలు జరుగు ముందు రోజు నుండి పోలింగ్ జరుగుతున్న సమయం మరియు పోలింగ్ పూర్తి అయిన తరువాత మరియు ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ పూర్తి అయ్యే వరకూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను చేయాలనీ తెలిపారు. ఎన్నికలు పారదర్శకముగా మరియు ప్రశాంతముగా జరిగేలా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.