విశాఖపట్నం, మీడియా పవర్, 06 మార్చ్ 2023: ఓటును అమ్ముకోవద్దని, పౌరులంతా ఓటును నమ్ముకోవాలని సెంచూరియన్ యూనివర్శిటీ వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు కోరారు. నిజాయితీపరుడు, పోరాట యోధుడు, నిరుద్యోగుల కోసం ఎంతో చేసిన వ్యక్తి హేమంత్ కుమార్ సమయంను బ్యాలెట్ పేపర్లో 37వ నంబర్పై ప్రతి ఒక్కరూ ప్రధమ ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా హేమంత్ బరిలో ఉన్నాడని అటువంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సోమవారం విశాఖలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హేమంత్కు తన మద్ధతు ఉంటుందని, మేధావులు, ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు, పట్టభద్రులు, నిరుద్యోగులు ఆయనకు ఓటేయాలన్నారు. 20ఏళ్లగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారని, కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు మరెవరూ చేయలేదని జీఎస్ఎన్ రాజు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో పట్టభద్రులు ఎక్కువమందే ఉన్నారని, ఆయన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యలపైనే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తాడని తెలిపారు. అనంతరం హేమంత్ మాట్లాడుతూ ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం 37మంది పోటీ చేస్తున్నారంటే ప్రజాస్వామ్య ఎక్కడికి పోతోందన్నారు. ఎన్నికల రోజునే కానిస్టేబుళ్లకు ఫిజికల్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ, అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ సుధాకర్తో పాటు పలువురు ప్రముఖులు తనకు సంఫీుభావం ప్రకటించారన్నారు. తనను గెలిపిస్తే జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, వయోపరిమితి పెంపు,బ్యాక్లాగ్ ఉద్యోగ నోటిఫికేషన్లు, ఔట్సోర్సింగ్ వారికి ఉద్యోగ భద్రత, ఆర్టికల్ 371 డి ద్వారా స్థానిక ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ వస్తే 75% ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా కృషి చేస్తానన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే ప్రైవేట్ వారు ఎస్సీ, ఎస్టీ ,బీసీ,మహిళ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వరని కనుక అంతవరకు ఉద్యమిస్తానని, చట్టసభలలో ఉత్తరాంధ్ర ప్రజల తరపున గొంతు వినిపించే విధంగా బ్యాలెట్లో 37వ నంబర్కు ప్రతి ఒక్కరూ ప్రధమ ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. సమావేశంలో సనపల తిరుపతిరావు, ముదిలి సంతోష్, రూప, రాధిక తదితరులు పాల్గొన్నారు.
ఓటును అమ్ముకోవద్దు..నమ్ముకోండి! సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ
March 06, 2023
0
Tags