మీడియా పవర్, విశాఖపట్నం : ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాల్సిన బాధ్యత మీడియాపై ఉందని ఐటీ, భారీ పరిశ్రమలశాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ అన్నారు. భారత దేశంలోనే ప్రప్రధమంగా ప్రారంభించిన ప్రింట్ మీడియా పబ్లిషర్స్, ఎడిటర్స్, జర్నలిస్టు ఫెడరేషన్ లోగో, లెటర్ హెడ్ ఆదివారం అయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా రంగంలో పబ్లిషర్ల పాత్ర బహు కీలకమన్నారు. అటువంటి పబ్లిషర్లు నేడు దేశ చరిత్రలో ఇప్పటివరకు లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి ప్రింట్ మీడియా పబ్లిషర్స్, ఎడిటర్స్, జర్నలిస్టు ఫెడరేషన్ స్థాపించడం అభినందించదగ్గ విషయం అని కొనియాడారు. వారి ఆశయాలు,ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు తెలిపారు.
అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు సూర్య భగవాన్ గొడవర్తి మాట్లాడుతూ సమాజంలో ప్రచురణకర్తలు లేకపోతే పాత్రికేయరంగమే లేదన్నారు. నానాటికీ ప్రచురణకర్తల పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. డిజిటల్ మీడియా ప్రాచుర్యం పొందిన తరువాత ప్రింట్ మీడియా రంగం అనేక ఒడిదుడుకులకు లోనైందన్నారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ, ప్రజాస్వామ్యంపై గౌరవాన్ని పెంచేలా సమాజాన్ని చైతన్య పరచడం, నైతిక విలువలతో కూడిన జర్నలిజాన్ని కాపాడడమే లక్ష్యంగా ఫెడరేషన్ స్థాపించామని తెలిపారు. ఫెడరేషన్ లో చేరే సభ్యులకు రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కు ప్రతిసంవత్సరం సమర్పించవలసిన ఈ ఫైలింగ్ చేయడంలోనూ, పెండింగ్ లో ఉన్న లేదా డీ బ్లాక్ లో ఉన్న టైటిల్స్ విషయంలో సహాయ సహకారాలు, సూచనలు అందించడంలో తోడ్పాటు కల్పిస్తామని తెలిపారు. పై విషయాలలో సమస్యలు వున్న ప్రచురణ కర్తలు ఫెడరేషన్ సభ్యులను సంప్రదించాలని కోరారు.
సెక్రటరీ జగన్మోహన్ విప్పర్తి మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టులు వ్యవస్థలో తయారవడంతో మీడియా ప్రతిష్ట దెబ్బతింటున్నాదని ఈ విధానాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఆర్ తేజేష్, కోశాధికారి జంగం జోషి, కార్యనిర్వాహక సభ్యులు కొల్లు ఉదయ్, ఎం సూర్యప్రకాష్, భాగ్యరాజు, గోపి జయంతి తదితరులు పాల్గొన్నారు.