- సెప్టెంబర్ 2 నుంచి కళా భారతి జాతీయ సంగీత నాటకోత్సవాలు
- 37 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో జాతీయ పురస్కారం
- వయొలిన్ విద్వాంసులు, అపర త్యాగరాజు పద్మశ్రీ, డాక్టర్ "అన్నవరపు రామస్వామి" కి నాద విద్యా భారతి పురస్కారం
మీడియా పవర్, విశాఖపట్నం, 2023 ఆగష్టు 31, : ప్రముఖ వయొలిన్ విద్వాంసులు, అపర త్యాగరాజు పద్మశ్రీ, డాక్టర్ "అన్నవరపు రామస్వామి" కి నాద విద్యా భారతి పురస్కారం అందించనున్నట్టు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి సంస్థ కార్యదర్శి జి అర్ కే ప్రసాద్ ( రాంబాబు ) తెలిపారు. గురువారం కళా భారతి ప్రాంగణం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ గత 36 సంవత్సరాలుగా వివిధ కళారంగాలలో నిష్ట్నాతులైన కళాకారులను ఆహ్వానించి, ప్రోత్సహిస్తూ కళాకారులకు సహాయం అందిస్తోందని తెలిపారు.
సంస్థ 37 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో సెప్టెంబర్ 2 వ తేదీ నుంచి 7 వరకూ ప్రఖ్యాతి గాంచిన సంగీత కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ సంగీత, నాటక ప్రదర్శనలు నిర్వహించనున్నామని తెలియచేసారు. జాతీయ పురస్కార బహుమతి గా లక్ష రూపాయల నగదు, ప్రశంసా పత్రం నూతన వస్త్రాలు, వాటితోపాటు రూ. 2 లక్షలు విలువ చేసే స్వర్ణ కమలం, ప్రతిష్టాత్మకమైన "నాద విద్యా భారతి" బిరుదు తో అపర త్యాగరాజు పద్మశ్రీ, డాక్టర్ అన్నవరపు రామస్వామిని సత్కరించడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 2 వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. 9 దశాబ్దాల కు పైగా వేలాది మంది శిష్యులను తయారుచేసిన సంగీత సరస్వతికి సేవలందిస్తూ దేశ, విదేశాల్లో నాద నీరాజనం అందిస్తున్నారని అన్నారు. ఈ ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా భారత పూర్వ ఉప రాష్ట్రపతి డా. ఏం. వెంకయ్య నాయుడు, నావికా దళ వైస్ అడ్మిరల్ జి. శ్రీనివాసన్ లు హాజరుకానున్నట్టు తెలియచేశారు.
సభ అనంతరం పురస్కార గ్రహీత రామస్వామి సంగీత కచేరీ సుమారు 2 గంటల సమయం సాగుతుందని తెలిపారు. సభా ప్రారంభ వేడుకలను సంస్థ అధ్యక్షులు, కళాభారతి అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు నిర్వహిస్తారని తెలియచేసారు. ఈ అవార్డు లో భాగంగా 2.5 లక్షలు నగదు అధ్యక్షులు అందిస్తారని , మరో 2 లక్షల రూపాయలు విలువైన స్వర్ణకమలాన్ని వైభవ్ జువెల్లర్స్ అందిస్తున్నట్టు తెలిపారు. గత 21 సంవత్సరాలుగా వీరి సహాయ సహకారాలను సంస్థకు అందిస్తున్నారని తెలిపారు.
సంగీతం, నాటకం, సాహిత్యం, నృత్యం ఇలాంటివన్నీ మరుగున పడి పోకుండా ప్రోత్సహించే సదుద్దేశంతో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అన్ని కార్యక్రమాలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తూ అందరిని ఆహ్వానిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు కళాభిమానులు సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో విచ్చేసి చూసి ఆనందించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాల వివరాలతో కూడిన ఆహ్వాన పత్రికను అధ్యక్షులు ఎం ఎస్ ఎన్ . రాజు, కార్యదర్శి గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణ ప్రసాద్, మల్లిక మనోజ్ గ్రంధి, మోహన్ దాస్ విడుదల చేశారు.