విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తే ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విశాఖలో ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులతో కలిసి మేధావులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వైకాపా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు.
''వైకాపా ప్రభుత్వం మొత్తం రూ. 13.50లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.2లక్షల రుణభారం మోపిందని తెలిపారు. ఖాజానా ఖాళీ చేసి పన్నుల భారం ప్రజల మీద వేసింది. రాష్ట్రాన్ని, విశాఖను డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా మార్చిందని ఆవేదన వ్యక్తం చేసారు హ్యూమన్ ట్రాఫికింగ్, మైనింగ్ మాఫియాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయని దుయ్యబట్టారు జగన్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో పూర్తిగా కూరుకుపోయిందన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి భరోసా ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ విస్మరించిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి తెలుగువారిపై ఉన్న గౌరవాన్ని ఎన్డీయే ప్రభుత్వం చాటి చెప్పిందన్నారు. వచ్చే ఐదేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడతాం'' అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.